- తెలంగాణ సహా పలు రాష్ట్ర రవాణా సంస్థల నుంచి దక్కించుకున్న కంపెనీ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ పలు రాష్ట్ర రవాణా సంస్థల నుంచి ఐదు వేలకి పైగా బస్సులు, బస్ చాసిస్ల ఆర్డర్లు దక్కించుకుంది. ఈ ఆర్డర్లను ప్రభుత్వ ఈ-బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా పొందింది. ఒప్పందాల ప్రకారం దశలవారీగా బస్సులను సరఫరా చేయనుంది.
మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, బీహార్, రాజస్థాన్, కేరళ, హర్యానా, చండీగఢ్ వంటి రాష్ట్ర రవాణా సంస్థల నుంచి కంపెనీ ఆర్డర్లు దక్కించుకుంది. టాటా మాగ్నా, సిటీ రైడ్, స్టార్బస్, స్టార్బస్ ప్రైమ్ వంటి మోడళ్లతో పాటు ఎల్పీఓ 1618, ఎల్పీఓ 1622, ఎల్పీఓ 1822 వంటి చాసిస్లను కూడా ఈ ఆర్డర్లు కవర్ చేస్తున్నాయి.
ఈ ఆర్డర్లు టాటా మోటార్స్పై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని, సేఫ్టీ, సౌకర్యం అందించేలా బస్సులను రూపొందించామని టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ అన్నారు.
